6కాదు గోవిందా 12..!
తిరుమలలో ఆరు కాదు.. పన్నెండు సూత్రాలు అమలు చేయాలి!
తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ఆరు సూత్రాల్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటం, పైరవీలకు చెక్ పెట్టడం, ఉద్యోగులు భక్తులతో గౌరవంగా వ్యవహరించడం, రికమండేషన్లను అరికట్టడం, షాపుల పేరుతో జరుగుతున్న దందాను నియంత్రించడం, అన్నప్రసాదం భక్తులకు సరిపడేలా అందించడం.. ఇవన్నీ అత్యంత ముఖ్యమైన అంశాలే.
అయితే తిరుమలలో భక్తుల అనుభవాన్ని మరింత మెరుగుపరచాలంటే ఈ ఆరు సూత్రాలకు మరో ఆరు అంశాలను కూడా జోడించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.
మొదటిది.. దర్శనానికి పడుతున్న సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేయాలి.
రెండోది.. ప్రతి భక్తుడికి స్వామివారిని కనీసం కొన్ని సెకన్ల పాటు ప్రశాంతంగా చూసుకునే అవకాశం కల్పించాలి. భక్తుడిని గుడిలోకి తీసుకెళ్లి వెంటనే తోసుకుంటూ బయటకు పంపడం కాకుండా, కనీసం 5 నుంచి 10 సెకన్ల పాటు స్వామివారి రూపాన్ని కన్నులారా చూసుకునే అవకాశం ఉంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.
మూడోది.. దర్శనంలో వీఐపీ, సామాన్య భక్తుడు అనే వ్యత్యాసాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ముఖ్యమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, అత్యవసర విధుల్లో ఉన్నవారికి అవసరమైన ప్రోటోకాల్ ఉండవచ్చు. అయితే సాధారణంగా రికమండేషన్తో వచ్చే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా క్యూలైన్లోనే దర్శనం కల్పించే విధానం ఉండాలి.
నాలుగోది.. రికమండేషన్ వ్యవస్థపై మరింత కఠినమైన నియంత్రణ ఉండాలి. ఒక సాధారణ భక్తుడు గంటల తరబడి క్యూలో నిలబడుతుంటే, సిఫారసు లేఖతో వచ్చిన వ్యక్తికి సులభంగా దర్శనం దొరికే పరిస్థితి ఉంటే సామాన్య భక్తుడిలో అసంతృప్తి కలగడం సహజం.
ఐదోది.. దర్శన క్యూల నిర్వహణలో సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించాలి. భక్తులు ఎంతసేపు వేచి ఉండాలి, ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఏ సమయంలో రద్దీ పెరుగుతోంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని క్యూలను నిర్వహించాలి.
ఆరోది.. స్వామివారి దర్శనం భక్తుడి జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలేలా చూడాలి. తిరుమలకు వచ్చే చాలామంది భక్తులు సంవత్సరానికి ఒకసారి, రెండేళ్లకు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ విరామంతో వస్తుంటారు. ఎంతో దూరం నుంచి, ఎన్నో గంటలు ప్రయాణించి వచ్చే వారికి చివరకు స్వామివారిని సరిగ్గా చూసుకోకుండానే తోసుకుంటూ బయటకు పంపే పరిస్థితి ఉండకూడదు.
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నా, గంటల తరబడి క్యూలో నిలబడినా, సేవల కోసం ఎదురుచూసినా.. చివరకు స్వామివారి ముందు కొన్ని క్షణాలు కూడా ప్రశాంతంగా నిలబడలేకపోతే భక్తుడికి కలిగే అనుభూతి అసంపూర్ణంగానే ఉంటుంది.
అందుకే తిరుమలలో భక్తుల కోసం ఆరు సూత్రాలతో పాటు మరో ఆరు సూత్రాలు.. మొత్తంగా పన్నెండు సూత్రాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
భక్తుడికి కావాల్సింది కేవలం వేగంగా దర్శనం కాదు.. ప్రశాంతంగా, గౌరవంగా, తృప్తిగా స్వామివారిని దర్శించుకునే అవకాశం.

